ఏలూరు రూరల్ : జిల్లాకు చెందిన క్రికెటర్లు వి.ఉజ్వల్(ఏలూరు), యూఏవీ వర్మ(భీమవరం) అండర్–19 ఆంధ్ర జట్టుకు ఎంపికైనట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఇటీవల విజయవాడ మూలపాడులో నిర్వహించిన అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో వీరు ప్రతిభ చూపినట్టు చెప్పారు. ఈ టోర్నీలో పాస్ట్ బౌలర్ ఉజ్వల్ 56 వికెట్లు తీసి 260 పరుగులు చేయగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ యూఏవీ వర్మ 32 వికెట్లు తీసి 200 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.