డాక్టర్ను చితకబాదిన బంధువులు
సాక్షి, రాజమహేంద్రవరం / కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వైద్యుడు దేవుడితో సమానం అంటారు పెద్దలు. అలాంటిది ఓ వైద్యుడు చికిత్స కోసం వచ్చిన ఓ బాలికపై తన వక్రబుద్ధిని చూపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. డాక్టర్ను చితకబాదిన బంధువులు ఆపై పోలీసులకు అప్పగించారు. ఈ ఘనట ఆదివారం రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండపేట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలిని దానవాయిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుమారు 20 రోజుల కిందట చేర్పించారు. ఆమె మనుమరాలు కూడా తల్లిదండ్రులతో పాటు ఇక్కడే ఉంటోంది. మృత్యువుతో పోరాడిన ఆ వృద్ధురాలు చివరకు ఆస్పత్రిలోనే చనిపోయింది. ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసిన బాలిక షాక్కు గురవడంతో మంగళవారం అదే ఆస్పత్రిలో చేర్పించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఏ ప్రమాదం లేదని, షాక్కు గురైందని స్పష్టం చేశారు. కొద్దిరోజులు అత్యవసర విభాగంలోనే ఉంచాలని చెప్పడంతో అక్కడే ఉంచారు. ఈ నేపథ్యంలో బాలికకు వైద్యం చేస్తున్న డాక్టర్ రామిరెడ్డి రాంభూపాల్ ఆమెపై కన్నేశాడు. అత్యవసర విభాగంలో బాలిక ఉన్న బెడ్ను బాత్ రూం వైపునకు మార్పించాడు. ఆదివారం రెండో అంతస్తులో ఉన్న అత్యవసర విభాగంలోకి ఎవ్వరూ వెళ్లకూడదంటూ సెక్యూరిటీ సిబ్బంది రోగుల బంధువులను కిందనే ఉంచారు. ఆస్పత్రిని శుభ్రం చేస్తున్నారంటూ చెప్పడంతో ఆ విభాగంలోని రోగుల బంధువులు కూడా కిందకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాలికను డాక్టర్ రాంభూపాల్ బాత్రూంకు తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించాడు. ఆ సమయంలో అత్యవసర విభాగంలో నర్సులు, కాంపౌండర్లు కూడా ఉన్నారు. అప్పటికే షాక్లో ఉన్న బాలిక ఈ ఘటనతో దిగ్బ్రాంతికి గురైంది. పెద్దగా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. బాలిక కేకలు విన్న తల్లిదండ్రులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నా వారిని తోసివేసి లోపలికి వెళ్లారు. విషయం తెలుసుకుని డాక్టర్ను చితకబాదారు. అక్కడ ఉన్న రోగి బంధువులు మీడియాకు, పోలీసులకు సమాచారమిచ్చారు. విచారించిన ఒకటో పట్టణ పోలీసులు డాక్టర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. లైంగిక దాడికి యత్నించిన సమయంలో బాలికను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కాంపౌండర్ ఫొటోలు కూడా తీశారని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ను పోలీసులు అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ ఎ.శ్రీనివాసరావు ఆస్పత్రిలో లేరని హెచ్ఆర్ మేనేజర్ పీవీఎన్ సూర్యారావు తెలిపారు. నెల్లూరుకు చెందిన రాంభూపాల్ గత మూడేళ్లు నుంచి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఘటన జరగడం బాధాకరమని, ఆ డాక్టర్ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడి వైద్య పట్టాను రద్దుచూసి కఠినంగా శిక్షించాలని బీసీ మహిళాసంఘం నాయకురాలు కె.హారిక, హర్షద్, ఎం.దుర్గాయాదవ్ తదితరులు ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేశారు.