కాళ్లు పట్టుకుని బతిమాలినా..

28 Aug, 2016 17:57 IST|Sakshi
కాళ్లు పట్టుకుని బతిమాలినా..
  • వైద్యం చేయడానికి నిరాకరించిన మాచర్ల వైద్యులు
  • వారి నిర్లక్ష్యంపై సాగరమ్మ బంధువుల ఆగ్రహం
  • కాన్పు చేసినందుకు జీజీహెచ్‌ వైద్యులకు కృతజ్ఞతలు
  • గుంటూరు మెడికల్‌ : ‘కాళ్లు పట్టుకుని బతిమాలినా మాచర్ల వైద్యులు కాన్పు చేయలేదు.. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మాకు అప్పటికప్పుడు మాచర్ల నుంచి గుంటూరుకు జీపు బాడుగకు మాట్లాడుకుని వెళ్లటం కష్టసాధ్యమైంది. తప్పనిసరై రూ.5 వేలు వడ్డీకి తీసుకుని జీపు బాడుగకు తీసుకుని రూ.3 వేలు చెల్లించాం..’ అని గర్భిణి చాట్ల సాగరమ్మ తల్లి మిరియమ్మ వాపోయింది. గుంటూరు జీజీహెచ్‌లో   వైద్యులు పెద్ద మనసుతో చికిత్స అందించటంతో తన కుమార్తె, మనవరాలు క్షేమంగా ఉన్నారని ఆమె శనివారం తనను కలిసిన ‘సాక్షి’కి తెలిపింది. అప్పటికప్పుడు జీపు బాడుగకు తీసుకొని కుమార్తెను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకురాగా స్థానిక వైద్యులు చికిత్స అందించారు. శనివారం ఉదయం సాగరమ్మ సాధారణ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టగానే శిశువు ఏడవకపోవడంతో ఐసీయూలో ఉంచారు. పేదరికంలో ఉన్న తమను మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో పట్టించుకోలేదని ఈ సందర్భంగా మిరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇస్రాయేలు, తాను కలిసి మాచర్ల వైద్యులను కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదని వాపోయింది. తన అల్లుడు లక్ష్మయ్య కూడా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడని వెల్లడించింది. ఒకవేళ పురిటినొప్పులు తట్టుకోలేక ఏదైనా అపాయకర పరిస్థితి ఏర్పడి తల్లి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించింది. 
     
    ఆందోళన వద్దు : ఆర్‌ఎంవో
    జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ యనమల రమేష్‌ శనివారం సాగరమ్మను పరామర్శించారు. ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా తక్షణమే అందేలా చూస్తామని, ఎలాంటి ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండాలని సాగరమ్మ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. సకాలంలో వైద్య సేవలు అందించిన జీజీహెచ్‌ వైద్యులకు సాగరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వార్తలు