కడప అర్బన్:
చిల్లర సమస్య నెపంతో సామాన్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిత్యావసర వస్తువుల డిస్ట్రిబ్యూటర్లతో ఓఎస్డీ (ఆపరేషన్స్) బి. సత్య ఏసుబాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిత్యావసర వస్తువుల డిస్ట్రిబ్యూటర్లు, రీటైర్లతో నిర్వహించిన సమావేశంలో ఓఎస్డీ మాట్లాడారు. స్వైపింగ్ మిషన్ ద్వారా గానీ, క్రెడిట్ అకౌంట్లతో హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు, రీటైర్లకు సరుకులను అందజేయాలన్నారు. అలాగే రీటైలర్లు కూడా వినియోగదారుల నుంచి లావాదేవీలను నిర్వహించాలని సూచించారు. హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ రీటైలర్లు ఇచ్చే పోస్ట్డేటెడ్ చెక్కులను తీసుకుంటామని చెప్పారు. కడప డీఎస్పీ మాట్లాడుతూ ఎక్కడైనా వ్యాపారుల నుంచి ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూం నెంబర్ 94407 96907కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, కడప అర్బన్ సీఐ యు. సదాశివయ్య, తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్, తహసీల్దార్ ప్రేమంత్ కుమార్ పాల్గొన్నారు.