డ్రైవర్‌కు జైలు శిక్ష

22 Sep, 2016 23:11 IST|Sakshi

మదనపల్లె టౌన్‌ (చిత్తూరు జిల్లా) : అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలం అల్లాపల్లికి చెందిన కె.మునెప్ప(40) మరణానికి కారకుడైన కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా దిగవూరు పంచాయతీ కాగితి గ్రామానికి చెందిన టెంపో డ్రైవర్‌ ఎస్‌.మహబూబ్‌బాషాకు చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టు గురువారం శిక్ష వేసింది. ఏపీపీ రామకృష్ణ, మదనపల్లె రూరల్‌ ఎస్‌ఐ రవిప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం...2011లో మదనపల్లె నుంచి మహబూబ్‌బాషా టెంపోను నడుపుకుంటూ కర్ణాటకకు బయలుదేరాడు. అదే సమయంలో అల్లాపల్లెకు చెందిన మునెప్ప వెంకటేశ్వరస్వామి దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు.

మార్గమధ్యంలోని బెంగళూరు రోడ్డులో గల చిప్పిలిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో ఢీకొని అతను అక్కడికక్కడే మరణించారు. అప్పటి ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితునికి మదనపల్లె ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మోహనరావు మూడు నెలల సాధారణ జైలుతో పాటు రూ.3 వేలు జరిమానా విధిస్తూ తీర్పువెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్‌ తరపున రామకృష్ణ వాదించారు. 

మరిన్ని వార్తలు