పూటుగా తాగొచ్చాడు.. ఫాస్ట్‌గా ఢీకొట్టాడు

7 Sep, 2017 11:55 IST|Sakshi
పూటుగా తాగొచ్చాడు.. ఫాస్ట్‌గా ఢీకొట్టాడు

మద్యం మత్తులో బైక్‌తో మరో బైక్‌ను ఢీకొట్టిన యువకుడు
దంపతులకు తీవ్ర గాయాలు


కాశీబుగ్గ: పూటుగా మద్యం తాగి బైక్‌ డ్రైవ్‌ చేసిన ఓ యువకుడు మరొక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పలాస–కాశీబుగ్గ శివారు ప్రాంతమైన కోసంగిపురం కూడలి వద్ద బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన నర్తు మాధవరావు అనే యువకుడు ఉదయాన్నే మద్యం తాగి ద్విచక్ర వాహనంపై తూలుతూ అతివేగంతో వాహనాన్ని నడుపుతూ వచ్చాడు. కోసంగిపురం కూడలి వద్ద ఎదురుగా వెళ్తున్న మందస మండలం సరియాపల్లి గ్రామానికి చెందిన షావుకారి ముకుందరావు, హేమలత దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. హేమలత తల రోడ్డుకు బలంగా తాకడంతో అధిక రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయింది.

ముకుందరావు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడిని 108 అంబులెన్సులో పలాస సీహెచ్‌సీకి తరలించారు. ప్రమాద విషయం ఫోన్‌ ద్వారా తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటరావు తొలుత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకుని వివరాలు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు