ఆత్మకూరురూరల్ : నిరుద్యోగ సమస్యపై యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడతా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని చెర్లో రమణారెడ్డి భవన్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్చేశారు. 14 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం 4,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ను విడుదల చేశారని, ఇందులోనూ అనేక సమస్యలున్నాయన్నారు. ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కానిస్టేబుల్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1, 2 పోస్టుల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పాలకులు యువతను మోసం చేస్తున్నారన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈనెల 14వ తేదీన జిల్లా మహాసభ జరుగుతుందని, ఇందులో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.