ఎచ్చెర్ల/లావేరు/సంతకవిటి: వరుస భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎచ్చెర్ల, పొందూరు, లావేరు, రణస్థలం తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8.10 గంటల సమయంలో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేశవరావుపేట, ఎస్ఎం.పురం తదితర చోట్ల గ్రామస్తులు రోడ్లపైకి చేరుకున్నారు. అయితే ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో 24, 27, 28, 29, 31, ఈ ఏడాది జనవరిలో 3, 4, 8వ తేదీల్లో, ఫిబ్రవరి 14న, మార్చి 7న, ఇదే నెల 5న స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. లావేరు మండలంలోని బుడుమూరులో బుధవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సంతకవిటి మండలంలోని మండాకురిటి గ్రామంలోనూ భూప్రకంపనలతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని వస్తు సామగ్రి కింద పడిందని గ్రామస్తులు తెలిపారు.