కొత్త కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా

18 Apr, 2017 00:15 IST|Sakshi
కొత్త కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా
- అరుణ్‌కుమార్‌ బదిలీ
- కర్నూలు కలెక్టర్‌గా జేసీకి పదోన్నతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ను ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా నూతన కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశం ఉంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పని చేసిన కార్తికేయ మిశ్రా 2009 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి. రాష్ట్రంలో పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లుగా డైరెక్ట్‌ ఐఏఎస్‌లను నియమించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనల్లో భాగంగానే ఈ నియామకం జరిగింది. కాగా, బదిలీ అయిన కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ సెర్‌‍్ప సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణను పదోన్నతిపై కర్నూలు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం రాత్రి ‘సాక్షి’కి ధ్రువీకరించారు. బదిలీ అయిన కలెక్టర్‌, జేసీలు ఇద్దరూ కన్‌ఫర్‌డ్‌ ఐఏఎస్‌లు. వీరిద్దరూ జిల్లాకు వచ్చి సుమారు రెండేళ్లు పూర్తవుతోంది. వారిద్దరినీ ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా జేసీగా ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
మరిన్ని వార్తలు