-
జిల్లా పరిషత్ చైర్పర్సన్కు అరుదైన గుర్తింపు
-
సీఎం కేసీఆర్ చైర్మన్గా టీఎస్ ఈజీసీ ఏర్పాటు
హన్మకొండ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మకు అరుదైన గుర్తింపు దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ మండలి(టీఎస్ ఈజీసీ)లో గద్దల పద్మ సభ్యురాలిగా నియమితులయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఈ మండలి ఏర్పాటైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు టీఎస్ ఈజీసీకి చైర్మన్గా, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కేటగిరీలో జెడ్పీ చైర్పర్సన్ పద్మ ఈ మండలిలో సభ్యురాలిగా నియమితులయ్యారు. చైర్మన్ సహా 30 మంది టీఎస్ ఈజీసీలో ఉంటారు. వ్యవసాయం, సాగునీరు, దళిత, గిరిజన, మహిళా సంక్షేమం, ఉపాధి కల్పన శాఖల మంత్రులు, ముఖ్యకార్యదర్శులు... గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, ఇద్దరు జెడ్పీ చైర్పర్సన్లు, ఒక జెడ్పీటీసీ సభ్యుడు, ఒక ఎంపీపీ, ఒక ఎంపీటీసీ సభ్యుడు, ఒక సర్పంచ్, నలుగురు కార్మికుల ప్రతినిధులు, ఐదుగురు ఎన్జీవోల ప్రతినిధులు మండలిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ఇద్దరు జెడ్పీ చైర్పర్సన్లకు ఈ మండలిలో స్థానం ఉంటుంది. ఈ ఇద్దరిలో ఒకరు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కావడం గమనార్హం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుతీరుపై టీఎస్ ఈజీసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. పనుల ప్రాధాన్యతను నిర్ణయిస్తుంది.