కాటేసిన విద్యుత్‌ తీగ

19 Jul, 2016 23:30 IST|Sakshi
విద్యుదాఘాతంతో కూలీ మృతి
తూర్పులక్ష్మీపురం (ఏలేశ్వరం) : తెగిపడి ఉన్న విద్యుత్‌ తీగపై కాలు పెట్టడంతో ఓ కూలీ మరణించిన సంఘటన మంగళవారం తూర్పులక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పులక్ష్మీపురం గ్రామానికి చెందిన నక్కా సూరిబాబు(55) వ్యవసాయ కూలీ. అతడికి భార్య అన్నవరం, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇలాఉండగా మంగళవారం ఉదయం అతడి ఇంటి వద్ద విద్యుత్‌ స్తంభం నుంచి వీధిదీపాల తీగ తెగి పోయింది. ఇంటి నుంచి బయటకు వస్తున్న సూరిబాబు ఆ తీగను గమనించకుండా, కాలు పెట్టాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే చనిపోయాడు. కూలీ పనులు చేసుకుని జీవించే ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఎస్సై వై.రవికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

 

మరిన్ని వార్తలు