'మీ సేవ' నుంచే విద్యుత్ కనెక్షన్ల మంజూరు

24 Sep, 2016 20:17 IST|Sakshi

తిరుపతి రూరల్: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ( సదరన్ డిస్కం) పరిధిలోని ఎనిమిది జిల్లాలో కొత్తగా ఎల్‌టీ, హెచ్‌టీ కేటగిరీలకు సంబంధించి కొత్త కనెక్షన్లను ఇకపై మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సదరన్ డిస్కం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై.దొర కోరారు. శనివారం తిరుపతిలోని డిస్కం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కం పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో కొత్త విద్యుత్ కనెక్షన్లను పొందేందుకు నిబంధనలను సరళతరం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నెల 26 నుంచి ఎల్‌టీ కేటగిరిలో గృహ విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, సాధారణ, దేవాలయాలకు విద్యుత్ కనెక్షన్లు, హెటీ కేటగిరిలో పరిశ్రమలు(సాధారణం), ఇతర సర్వీసులు, మౌళిక, పర్యాటకం, ప్రభుత్వ, ప్రైవేటు ఎత్తిపోతలు, వ్యవసాయం, సిపిడబ్ల్యుఎస్, రైల్వే ట్రాక్షన్, టౌన్‌షిప్స్, రెసిడెన్షియల్ కాలనీస్, గ్రీన్ పవర్, తాత్కలిక సర్వీసులను పొందడానికి మీ-సేవా కేంద్రం నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పేరు మార్చుకోవాలన్నా..
ఎల్‌టీ కేటగిరికి సంబంధించి పేరు, కేటగిరి, లోడ్ మార్పు అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా మీ-సేవా ద్వారానే బుక్ చేసుకోవాలని సీఎండీ హెచ్‌వై దొర సూచించారు. ప్రస్తుత విద్యుత్ లైన్ల నుంచి కనెక్షన్‌ను మంజూరు చేసే సందర్భాల్లో డెవలప్‌మెంట్ చార్జీలను కూడా మీ-సేవా కేంద్రం ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు.

విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసి సర్వీసును మంజూరు చేసే సందర్భాల్లో మాత్రమే సంబంధిత డెవలప్‌మెంట్ చార్జీలను ఏపీఎస్పీడీసీయల్ సబ్-డివిజన్ కార్యాలయాల్లో చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. కల్యాణ మండపాలు, ఎన్టీయార్ సుజల పథకం, తాత్కాలిక సర్వీసులు, ఎన్టీయార్ జలసిరి సర్వీసులకు సంబంధించి మాత్రమే ఏపీఎస్పీడీసీయల్ కాల్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు