విద్యుత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

14 Jun, 2016 11:00 IST|Sakshi

నిజామాబాద్‌: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌(టీ టఫ్‌) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

అనంతరం విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ప్రభాకర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా చైర్మన్, కన్వీనర్లు లక్ష్మారెడ్డి, పూదరి గంగాధర్‌లు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా కాంట్రాక్టు కార్మికులు అరకొర వేతనాలతో జీవనం సాగిస్తున్నారన్నారు. తమను సీఎం కేసీఆర్‌ రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు పరిమితి లేని వైద్యసదుపాయం అందించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్, జక్రియా, నరేందర్‌నాయక్, నవీన్, రమేశ్, తిరుపతి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు