ఎలివేటెడ్ కారిడార్‌కు మార్గం సుగమం

17 Dec, 2015 07:53 IST|Sakshi
ఎలివేటెడ్ కారిడార్‌కు మార్గం సుగమం

కంటోన్మెంట్ స్థలం ఇస్తామన్న రక్షణ శాఖ?
* వేయి కోట్లతో ఆరువరసల ఆకాశవంతెన నిర్మాణం
* ప్యాట్నీ కూడలి-రాజీవ్ హైవే అనుసంధానం
* 11 కి.మీ. మేర కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదన
* డీపీఆర్ రూపొందించిన ఆర్‌అండ్‌బీ

 సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఆరు వరసలతో కూడిన పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. నగరంలోని ప్యాట్నీ కూడలిని హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో అనుసంధానించే ఈ ఆకాశమార్గం నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్యాట్నీ కూడలి నుంచి రాజీవ్ హైవేపై హకీం పేట వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ. వేయికోట్లతో ఈ వంతెన నిర్మా ణం చేపట్టనున్నారు. ఇందులో ఎలివేటెడ్ భాగ మే ఎక్కువగా ఉండనుంది. దీనిని రక్షణ శాఖ కు చెందిన కంటోన్మెంట్ మీదుగా నిర్మించాల్సి ఉంది. రక్షణ శాఖ స్థలం కేటాయిస్తేనే దీని నిర్మాణం సాధ్యమవుతుంది. ఇందుకు దాదా పు 40 ఎకరాల స్థలం అవసరమవుతుందని రోడ్లు భవనాల శాఖ గుర్తించటంతో.. అంతమేర స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు లేఖ రాసింది.

 రాష్ట్రానికి వచ్చిన రక్షణ శాఖ ప్రతినిధి
 ఇటీవల రక్షణ శాఖ ప్రతినిధి హైదరాబాద్‌కు వచ్చి అధికారులతో భేటీ అయ్యి.. స్థలాన్ని ఇచ్చేందుకు తాము సానుకూలమని పేర్కొన్నారు. గతంలో సికింద్రాబాద్  జింఖానా సమీపంలోని బైసన్‌పోలో మైదానాన్ని కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనికి రక్షణ శాఖ సానుకూలంగా స్పందించలేదు. దానిని వదులుకునే పక్షంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న ట్టు రక్షణ శాఖ అంతకుముందే పేర్కొంది.

బైసన్‌పోలో మైదానంలో సచివాలయం నిర్మించే అంశాన్ని విరమించుకున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన అధికారులు తెలపడంతో రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన భూమిని కేటాయించే అంశానికి సానుకూలత వ్యక్తం చేసిందని ఆ ప్రతినిధి అధికారుల దృష్టికి తెచ్చారు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అనుమతి రాగానే పనులు ప్రారంభించే యోచనలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ దీనికి సంబంధించి డీపీఆర్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఆకాశమార్గాల్లో నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో నిర్మించిన పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే పొడవైనదిగా రికార్డుల్లోకెక్కింది. దాని పొడవు 11.6 కిలోమీటర్లు. కానీ అది నాలుగు వరసలతో నిర్మితమైంది. కొత్తగా నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ ఆరు వరసలది కావటంతో దేశంలో ఇదే పొడవైందిగా రికార్డుల్లోకెక్కనుంది.

 మే తర్వాత ఏవోసీ మీదుగా ప్రవేశం ఉండదు
 సికింద్రాబాద్ నుంచి సఫీల్‌గూడ రోడ్డుకు అనుసంధానిస్తూ రక్షణ శాఖ ప్రాంతం ఏవోసీ మీదుగా ఉన్న రోడ్డుపై సాధారణ వాహనాల ప్రవేశం వచ్చే మే చివరి నాటి వరకే కొనసాగనుంది. ఆ తర్వాత దానిని మూసేస్తామని, మరికొద్ది కాలం అనుమతి కోరే విన్నపాలను పరిగణనలోకి తీసుకోబోమని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ లోపు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అడ్డగుట్ట, నేరేడ్‌మెట్-తిరుమలగిరి రోడ్ల విస్తరణకు అవసరమైతే రక్షణ శాఖ స్థలాలను కేటాయించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది.
 

>
మరిన్ని వార్తలు