ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద ఉధృతి

23 Jul, 2016 23:21 IST|Sakshi
  • 144.50 మీటర్లకు చేరిన నీరు
  • ముంపు గ్రామాలు ఖాళీ చేయాలని జేసీ ఆదేశాలు
  • మంచిర్యాల రూరల్‌ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ భారీగా నిండుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు కడెం ప్రాజెక్ట్‌ గేట్లు తీయడంతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్ట్‌కు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్‌ లెవెల్‌ కాగా శనివారం రాత్రి 8 గంటల వరకు 144.50  మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 6,400ల క్యూసెక్కుల కాగా 521 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జేసీ సుందర్‌ అబ్నార్‌ నిర్వాసితులను ఆదేశించారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నీటిమట్టం 145.50 మీటర్లకు పెరిగితే చందనాపూర్‌ నీట మునిగే ప్రమాదం ఉంది.
మరిన్ని వార్తలు