ఆక్రమణల తొలగింపు

1 Oct, 2016 01:16 IST|Sakshi
ఆక్రమణల తొలగింపు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థకు చెందిన రెండు రిజర్వ్‌డ్‌ స్థలాలను స్టోన్‌హౌస్‌పేటలో వాణిజ్య వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి గదులను నిర్మించారు. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదు మేరకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఆదిత్యనగర్‌లో ఎల్పీ నంబర్‌ 94 / 92 స్థలంలోని 96 అంకణలు కలిగిన రెండు పార్క్‌ స్థలాలను ఆక్రమించి ప్రహరీ, రెండు గదులను నిర్మించారు. ఈ క్రమంలో 16వ డివిజన్‌ అభివృద్ధి కమిటీ గతేడాది నుంచి స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలుమార్లు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కూడా కబ్జా పర్వాన్ని కమిషనర్‌కు వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసుల సాయంతో జేసీబీతో ఆక్రమణలను కూల్చేశారు. 
కానరాని కబ్జాదారులు
కబ్జా చేసిన స్టోన్‌హౌస్‌పేటలోని వాణిజ్య వ్యాపారి, అధికార పార్టీ నేత ఆక్రమణల తొలగింపు సమయంలో కానరాలేదు. ఓ మాజీ ఎమ్మెల్యే సాయంతో కబ్జా చేశారు. ప్రస్తుతం కబ్జాను అడ్డుకుంటే తనకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చేరుకోలేదని సమాచారం. టీపీఓ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు