జెడ్పీ సీఈఓపై విచారణ చేపట్టండి

10 Aug, 2017 22:31 IST|Sakshi
జెడ్పీ సీఈఓపై విచారణ చేపట్టండి

అనంతపురం రూరల్‌: నగరంలోని అంబేద్కర్‌ భవన్‌కు సంబంధించిన టెండర్‌లో అక్రమాలకు పాల్పడిన జెడ్పీ సీఈఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్సీ గ్రీవెన్సులో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ వీరపాండియన్‌కు వినతి పత్రం అందజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ నిధులతో నిర్మించిన భవనాన్ని జెడ్పీ సీఈఓ ఎలాంటి పత్రిక ప్రకటన ఇవ్వకుండా తనకు అనుకూలమైన వ్యక్తికి ధారాదత్తం చేశాడని ఆరోపించారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్‌ భవన్‌ అద్దెను నిర్ణయించాలన్నారు.

గ్రీవెన్స్‌లో అందిన ఫిర్యాదులు ఇలా...
నగరంలో అనేక మంది దళిత గిరిజనులు అద్దె భవనాల్లో జీవనం సాగిస్తున్నారని ప్రతి ఒక్కరికీ స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు చిన్న పెద్దన్న వినతి పత్రం అందజేశారు.
– ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకు తీసుకెళ్లి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మధు మాదిగ ఆధ్వర్యంలో మాదిగలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకుని గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేశారు.

– 10 ఏళ్ల క్రితం ప్రభుత్వం తనకు 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అయితే ఆన్‌లైన్‌లో తన భూమి సర్వేనంబర్‌ను తొలగించారనీ, మూడేళ్లుగా అధికారుల చుట్టు తిరుగుతున్నా.. .పట్టించుకోవడం లేదని కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సాకే రంగమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆన్‌లైన్‌లో తన పేరు పొందుపరచాలని వేడుకుంది.
 – గోరంట్ల మండలం బండమీదపల్లి తండా, మిషన్‌తండా, పీపీ తండాల్లోని భూములను ఎయిర్‌ బస్సు  పరిశ్రమ నిర్మాణానికి కేటాయించారనీ, అయితే ఇంత వరకు నష్టపరిహారం అందజేయలేని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించి తమకు పరిహారం తర్వతగతిన ఇప్పించాలని కోరారు. గ్రీవెన్స్‌లో మొత్తం 207 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు రమామణి, ఖాజామొహిద్దీన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు