సీఎం సారూ... జరా కాపాడండి!

4 Jun, 2016 22:43 IST|Sakshi

జగదేవ్‌పూర్: తమ గ్రామాన్ని కాపాడాలని మల్లన్న సాగర్ ముంపు బాధితులైన మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి వాసులు సీఎం కేసీఆర్‌ను కోరారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ముంపు వాసులు శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చారు. ఎర్రవల్లి వాటర్ ట్యాంకు వరకు రాగానే పోలీసులు వారిని అడ్డగించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. సీఎం కలిసే అవకాశం లేదని సముదాయించారు.

సీఎంకు ఇవ్వాలనుకున్న వినతి పత్రాన్ని డీఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ... మల్లన్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని కొంత వరకు తగ్గించి తమ గ్రామం ముంపునకు గురికాకుండా చూడాలని కోరారు. భూమికి భూమి, ఇంటికి బదులు ఇల్లు, ఊరుకు బదులు ఊరిని నిర్మించి ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు