మండలానికి ఒక మోడల్‌ కాలనీ

24 Aug, 2017 21:48 IST|Sakshi

అనంతపురం టౌన్‌: మండలానికి ఒక మోడల్‌ కాలనీ కట్టించడంపై దృష్టి సారించాలని.. అప్పుడే మనం ఏ ఇళ్లు కట్టించాం.. ఎన్ని కట్టించామనే లెక్క తేలుతుందని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం అనంతపురంలోని జెడ్పీ ఆవరణలో ఉన్న పంచాయతీ వనరుల కేంద్రం మీటింగ్‌ హాల్‌లో రాయలసీమ జిల్లాల హౌసింగ్‌ అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్‌ 15లోగా 2017–18, 2018–19కి సంబంధించి ఎన్టీఆర్‌ రూరల్‌ కింద మంజూరైన ఇళ్లకు పరిపాలన ఉత్తర్వులు తీసుకోవాలన్నారు.

అధికారుల వైఖరితో తన పనితీరుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. సొంత జిల్లా అనంతపురం, ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కర్నూలులో ఇళ్ల  నిర్మాణ ప్రగతి అధ్వానంగా ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ కారణాలుంటే తన దృష్టికి తేవాలన్నారు. జియో ట్యాగింగ్, బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు డబ్బు డిమాండ్‌ చేస్తే 1100 నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. అనంతరం హౌసింగ్‌ ఎండీ కాంతిలాల్‌ దండేతో కలిసి జిల్లాల వారీగా సమీక్షించారు. సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ ఎస్‌ఈలు శ్రీరాములు, వెంకటరెడ్డి, మల్లికార్జునరావు, కలెక్టర్‌ వీరపాండియన్, జేసీ–2 ఖాజామొహిద్దీన్, సీమ జిల్లాల హౌసింగ్‌ పీడీలు సీవీ ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, ధనుంజయుడు, ఎస్‌వీఆర్‌ ప్రసాద్, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు