మాజీ ఎంపీ కేఎస్సార్‌ మూర్తి మృతి

29 Dec, 2016 23:17 IST|Sakshi
  • హైదరాబాద్‌లోని స్వగృహంలో కేన్సర్‌తో కన్నుమూత
  • కోనసీమ దాహార్తిని దూరం చేసి తాగునీటి ప్రాజెక్టులు తెచ్చిన నేత
  • కాంగ్రెస్‌ ఎంపీగా, విశ్రాంత ఐఏఎస్‌గా సేవలు
  • అమలాపురం టౌన్‌ :
    అమలాపురం మాజీ ఎంపీ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ఆర్‌ మూర్తి గురువారం తెల్లవారు జాము 4.30 గంటలకు మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కోంపల్లిలో గల స్వగృహంలో కన్నుమూశారు. 1996లో మూర్తి అమలాపురం ఎంపీగా జీఎంసీ బాలయోగిపై గెలుపొందారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన మూర్తి 1969లో ఐఏఎస్‌కు ఎంపికై రాష్ట్రంలో కలెక్టర్, తదితర ఉన్నత ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లలో కీలక హోదాల్లో పనిచేశారు. 1993లో ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చి 1995లో అమలాపురం ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని దౌవగౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాౖటెన కేంద్ర ప్రభుత్వంలో కొన్ని ప్రతికూల కారణాల పార్లమెంటు రద్దు కావడంతో మూర్తి ఎంపీ పదవి 18 నెలలకే పరిమితమైంది. తర్వాత 1998లో ఎంపీగా బాలయోగి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి సలహాదారుడిగా...రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి, కొద్దికాలంలోనే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు.  అలాగే ముమ్మిడివరంలోని బాలయోగీశ్వరుల తపో ఆశ్రమానికి 1985 నుంచి కమిటీ సభ్యునిగా... 1994 నుంచి కమిటీ చైర్మ¯ŒS పనిచేశారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సంజయ్‌మూర్తి తండ్రి బాటలోనే ఐఏఎస్‌ అధికారి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌ కాస్ట్‌ జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
    9 భారీ తాగునీటి ప్రాజెక్టులకు రూపశిల్పి :
    మూర్తి ఎంపీ కాగానే కోనసీమలోని సముద్ర తీర గ్రామాలు తాగునీటితో ఇబ్బంది పడుతున్న సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో సెక్రటరీగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో వివిధ శాఖలతో పరిచయాలు, పలుకుబడితో 1997లో కోనసీమకు ఒకేసారి దాదాపు రూ. వంద కోట్లతో 9 భారీ తాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేయించి దాదాపు 500 గ్రామ శివార్లకు తాగునీరు అందేలా చేశారు. ఆ ప్రాజెక్టులే ఇప్పుడు గుడిమెళ్లం, తొత్తరమూడి, ఉప్పలగుప్తం తదితర ఆర్‌డబ్లు్యఎస్‌ ప్రాజెక్టులుగా సేవలు అందిస్తున్నాయి. 
     
     
మరిన్ని వార్తలు