అనుమానాస్పదస్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి

25 Jun, 2016 00:11 IST|Sakshi
అనుమానాస్పదస్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి

పెద్దేముల్/పటాన్‌చెరు: ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం జరిగింది. ఎస్సై వెంకటశీను కథనం మేరకు.. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన పొట్టుపల్లి మంజుల(34), అదే గ్రామానికి చెందిన మహేశ్.. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ సమయంలో 2015, అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పటాన్‌చెరువు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరూ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలోని భూ కైలాస్ ఆలయానికి వెళుతున్నట్లు చెప్పి బైక్‌పై బయలు దేరారు.

ఏమైందో తెలియదు కానీ.. తెల్లవారుఝామున గాజీపూర్ గ్రామ సమీపంలో తాండూరు - సంగారెడ్డి రహదారిపై మంజుల, మహేష్ పడి ఉన్నారు. గాజీపూర్‌వాసులు గమనించి పోలీసులకు చెప్పారు. వారు వచ్చి పరిశీలించగా.. మంజుల అప్పటికే మృతిచెందగా.. స్పృహ కోల్పోయి ఉన్న మహేష్‌ను ఆస్పత్రికి తరలించారు. మంజుల శరీరంపై గాయాలు లేకపోయినా.. ముక్క నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించారు. కాగా, అమ్మాయి తండ్రి నర్సిములు మాత్రం తమ కుమార్తెను అల్లుడు మహేష్‌తో పాటు ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి అంజమ్మ, తమ్ముడు ప్రదీప్, బావ మల్లేశం కలసి హత్య చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Election 2024

మరిన్ని వార్తలు