పోచంపల్లిలో ఫేస్‌బుక్ ప్రతినిధులు

9 Dec, 2015 19:55 IST|Sakshi
పోచంపల్లిలో ఫేస్‌బుక్ ప్రతినిధులు
భూదాన్‌పోచంపల్లి: కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయానికి చెందిన 25 మంది ప్రతినిధుల బృందం బుధవారం నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిని సందర్శించింది. రెండు బృందాలుగా విడిపోయి ఆదరణ ఫౌండేషన్, కళాశాలలు, చిరు వ్యాపారులు, చేనేత గృహాలను సందర్శించారు. ఎంత మంది విద్యార్థుల వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి... ఫేస్‌బుక్, వాట్సప్ అకౌంట్స్‌ను ఎంత మంది వినియోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
 
రోజూ ఫేస్‌బుక్ పై ఎంత సమయం వెచ్చిస్తారు, ఎలాంటి పోస్టింగులు చేస్తారు, సోషల్‌ మీడియా ప్రభావాన్ని గురించి అడిగి వివరాలు రాబట్టారు. చాలా మంది విద్యార్థినులు ఫేస్‌బుక్, వాట్సప్ గురించి తెలియదని చెప్పడంతో వారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి ఫేస్‌బుక్, వాట్సప్ యాప్స్ ద్వారా ఆన్‌లైన్ వ్యాపారాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ ప్రతినిధి బోగ కిరణ్ మాట్లాడుతూ... ఫేస్‌బుక్, వాట్సప్ వంటి యాప్స్‌లను గ్రామీణ ప్రజలు వినియోగిస్తున్నారా, ఇంకా యాప్స్‌లలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సర్వే చేసేందుకు ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు.
మరిన్ని వార్తలు