నకిలీ విలేకరి అరెస్ట్‌

19 Aug, 2016 01:11 IST|Sakshi

రాప్తాడు : ప్రముఖ దినపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విలేకరిగా పని చేస్తున్నానంటూ ఆర్‌ఎంపీ డాక్టర్లు, ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లు, మెడికల్‌ షాపులు, ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరి దాలు సుబ్బరాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు రాప్తాడు ఎస్‌ఐ ధరణిబాబు విలేకరులకు గురువారం తెలిపారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతానికి చెందిన దాలు సుబ్బరాయుడు అలియాస్‌ ప్రవీణ్, రఫీ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని మతాంతర వివాహం చేసుకుని ఐదేళ్ల కిందట అనంతపురానికి మకాం మార్చాడు.


రాప్తాడు మండలం చిన్మయానగర్‌లోని అద్దె ఇంటిలో కాపురముంటూ నంబర్‌ వన్, టీవీ 5 చానళ్లలో కొంత కాలం పని చేశాడు. సుబ్బరాయుడు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రెండు చానళ్ల వారు తొలగించారు. అప్పటి నుంచి మన తెలుగు చానల్, టీవీ 9 విలేకరి నంటూ ఆర్‌ఎంపీ, మెడికల్‌ షాపుల నిర్వాహకులను బెదిరించి, డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. మహిళ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను బెదిరించి రూ.7 వేలు వసూలు చేశాడు.


అనంతపురం గుల్జార్‌పేటలోని ఓ సెల్‌ దుకాణంలో సెల్‌ కొని డబ్బులు మళ్లీ ఇస్తానని ఊడాయించాడు. ఈ మధ్యనే చిన్మయానగర్‌లోని మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న రఫీ దగ్గరకు వెళ్లి అనుమతులపై ఆరా తీసి బెదిరించాడు. తనకు రూ.25 వేలు ఇవ్వాలని, లేకుంటే డీఎంహెచ్‌ఓతో చెప్పి షాపు ఎత్తివేయిస్తానంటూ బెదిరించాడు. తన వద్ద అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయంటూ రూ.4,700 ఇచ్చాడు. అనంతరం ఇదే విషయంపై ఎస్‌ఐ ధరణిబాబుకు ఆయన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కచ్చితమైన ఆధారాలతో నిందితుడు సుబ్బరాయుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు