యథేచ్ఛగా నకిలీ దందా

2 Jun, 2017 08:47 IST|Sakshi
యథేచ్ఛగా నకిలీ దందా

► అక్రమార్కులకు హౌసింగ్‌ ఏఈ అండ ?
► తవ్వేకొద్ది బయట పడుతున్న నకిలీ పట్టాలు
► ‘సాక్షి’ కథనంతో ముందుకు వస్తున్న బాధితులు
► వైఎస్సార్‌నగర్‌లో ఇదీ పరిస్థితి


నెల్లూరు రూరల్‌ : తీగలాగితే డొంక కదిలినట్లు వైఎస్సార్‌ నగర్‌ను ఆక్రమించుకుని నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. వీరి వెనుక హౌ సింగ్‌ శాఖకు చెందిన ఏఈ అండ కూడా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గురువారం సాక్షి పత్రి కలో వైఎస్సార్‌నగర్‌లో రౌడీరాజ్యం పేరుతో కథనం ప్రచురితమైంది. దీంతో శివ, మంజు అనే అక్రమార్కుల బారినపడి దెబ్బలు తిన్న బాధితులెందరో ముందుకు వచ్చి అక్కడ నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతున్న వైనం గురించి ‘సాక్షి’కి తెలిపారు.

ఫోర్జరీ సంతకాలతో పట్టాలు
వైఎస్సార్‌నగర్‌లో ప్రభుత్వం పదేళ్ల క్రిందల 6,465 ఇళ్లను మంజూరు చేసింది. కాలనీ పరిస్థితులు నివసించేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఏడాది క్రితం వరకు ఇళ్లల్లో ఎవరూ చేరలేదు. తరువాత జిల్లా అధికారులు కాలనీ అభివృద్ధికి నిధులను విడుదల చేయడంతో లబ్ధిదారులు ఒక్కొక్కరిగా ఇళ్లల్లో చేరసాగారు. ఇదే అదునుగా భావించిన కొంత మంది ముఠాగా ఏర్పడి ఏకంగా హౌసింగ్‌ అధి కారుల సంతకాలను ఫోర్జరీ చేసి(స్కాన్‌), ఇంటికి అసలు పట్టాలు ఉండగానే నకిలీ పట్టాలు సృష్టించి అమ్మసాగారు. ఈ విధంగా అక్రమార్కులు రాత్రికి రాత్రే బడా ధనవంతులుగా  మారారు. ఇందుకు స్థానికంగా ఆ కాలనీని పర్యవేక్షిస్తున్న సంబంధిత ఏఈ సహకారం కూడా అందించారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

నకిలీ పట్టాలను కొనుగోలు చేసి మోసపోయిన వారిలో కొన్ని ఉదాహరణలు
ß 1350 ప్లాట్‌ నంబర్‌ నిజమైన లబ్ధిదారిణీ పుష్ప పేరుమీద పట్టా మంజూరై ఉంది. అయితే ఈ ప్లాట్‌కి నకిలీ పట్టా సృష్టించి లక్ష రూపాయలకు కీలా నాగరాజుకు అమ్మేశారు. తెలియక కొనుగోలు చేసి తీవ్రంగా మదన పడుతున్నారు.
ß 1349 ప్లాటు యరవ విజయలక్ష్మి పేరుపై ఉంది. దీనికి కూడా నకిలీ సృష్టించి కె.భూపతికి రూ.80 వేలకు అమ్మేశారు. కొనుగోలు చేసింది నకిలీ పట్టా అని తేలడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు
ß 2017 ప్లాట్‌ నంబర్‌ లలిత పేరుతో ఉంది. దీనిని ఆక్రమించుకుని అక్రమార్కుడు నివాసం ఉంటున్నాడు.

నకిలీపై నిలదీయడంతో దాడి చేశారు
నేను నిరుపేదరాలను. బాలాజీనగర్‌లో ఇళ్లలో కూలి చేసి అర్ధాకలితో దాచిపెట్టుకున్న డబ్బులతో వైఎస్సార్‌నగర్‌లో తక్కువకు వస్తుందనే ఆశతో ఇల్లు కొనుగోలు చేశాను. శివ అనే వ్యక్తి నకిలీ పట్టా నాపేరుతో ఇచ్చి డబ్బులు రూ.80 వేలు తీసుకున్నాడు. తీరా నకిలీ అని తేలడంతో ఇదేమి పని అని నిలదీయగా బూతులు తిడుతూ నాపై దాడి చేశారు.  – వల్లం ఉమామహేశ్వరి, బాలాజీనగర్‌

అక్రమార్కులపై ఉక్కుపాదం
వైఎస్సార్‌నగర్‌లో శివ, మంజు లాంటి  కొంత మంది లబ్ధిదారులు కాని వారు అక్రమంగా నకిలీ పట్టాలను తయారు చేసి అమ్మకాలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. నకిలీ పట్టాలను పరిశీలించగా అధికారుల సంతకాలను స్కాన్‌చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాం. లబ్ధిదారులకు అన్యాయం చేసిన వారి వివరాలను సేకరిస్తున్నాం. పీడీ రామచంద్రారెడ్డి సహకారంతో ఇల్లిళ్లూ తిరిగి విచారణ చేస్తాం.  నకిలీ పట్టాలు అమ్మడమే కాక లబ్ధిదారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠినచర్యలు చేపడతాం. –రాజారత్నం, హౌసింగ్‌ డీఈఈ

మరిన్ని వార్తలు