నకిలీ పాస్‌ పుస్తకాలతో టోకరా

8 Feb, 2017 03:28 IST|Sakshi

నేరేడుచర్ల : నకిలీ పాస్‌ పుస్తకాలతో కొందరు రైతులు బ్యాంకు అధికారులకు టోకరా ఇచ్చి రూ.8.72 లక్షల రుణం పొందారు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సిండికేట్‌ బ్యాంకులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. చిల్లేపల్లి సిండికేట్‌ బ్యాంకు మేనేజర్‌ రాజేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధి బూర్గులతండాకు చెందిన మాలోతు గోవింద్, సైదా, భద్రమ్మ, దేవోజు, రకిలీ, ధర్మల పేర్లతో వారి సర్వే , పాస్‌బుక్‌ నంబర్లతో నకిలీ పాస్‌ పుస్తకాలను సృష్టించారు. వాస్తవంగా ఉన్న యజమాని స్థానంలో గుర్తు తెలియని వ్యక్తుల ఫొటోలు అంటించి ఆధార్‌కార్డులను సైతం వారి పేర్లతో నకిలీవి తయారు చేశారు.  

పక్కా ప్రణాళికతో..
నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అధికారులను పక్కా ప్రణాళికతో మోసగించారు. గత  ఏడాది నూతనంగా ప్రారంభించిన చిల్లేపల్లి సిండికేట్‌ బ్యాంకులో మోసగాళ్లు రోజుకు ఇద్దరి పేరిట మొత్తం మూడు విడతలుగా 8.72 లక్షల రుణం పొందారు. బ్యాం కు నిబంధనల ప్రకారం పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్, ఆన్‌లైన్‌ పహాణీ, అధార్‌ కార్డు సరిపోవడంతో అధికారులు రుణాలు మంజూరు చేశారు. చివరగా మాలోతు పాచ్యా పేరుతో బ్యాంకు శాఖ అవంతీపురంలో అప్పటికే లోన్‌ ఉన్నట్లు గుర్తించి ఎస్‌బీ ఎకౌంట్‌లో ఉన్న  రూ.1.20 లక్షలను డ్రా చేయకుండా ఖాతాను నిలుపుదల చేశారు. అనుమానంతో గ్రామానికి చెందిన పాస్‌బుక్‌లపై రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా బ్యాంకును మోసగించినట్లు గుర్తించామని మేనేజర్‌ రాజేశ్వర్‌ తెలిపారు. నకిలీపాస్‌ పుస్తకాలు సష్టించి రు ణాలు పొందినట్లు నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్‌లో, తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు