వలిగొండ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక క్రిమి సంహారక మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..నాతాళ్లగూడెంకు చెందిన నోముల లక్ష్మయ్య (44) అనే రైతు ఇంట్లో ఎవరు లేనిది చూసి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన సమీప బంధువు 108కు సమాచారమిచ్చాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. మృతుడు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయ చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు కుమారుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ భాగ్యనాయక్ కేసు నమోదు చేశారు.