రోడ్డెక్కిన రైతులు

2 Sep, 2016 00:53 IST|Sakshi

ఓడీ చెరువు: రక్షకతడి కోసం రైతులందరికీ పైపులు, రెయిన్‌గన్లు ఇవ్వాలంటూ గురువారం పలు గ్రామాల రైతులు రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లాపల్లి, వనుకువారిపల్లి, గాజుకుంటపల్లి తదితర గ్రామాల రైతులు మాట్లాడుతూ రక్షక తడికోసం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోయారు. వారం నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ పైపులు ఇవ్వడం లేదన్నారు. అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే అందిస్తున్నారని వారు ఆరోపించారు.  

పంట ఎండాక పైపులు ఇస్తే ఏం చేసుకోవాలని వారు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం పైపులు ఇస్తామని స్లిప్పులు రాసిచ్చారన్నారు. అవి తీసుకుని గోడౌన్‌ వద్దకు వస్తే పైపులు అయిపోయాయి.. వచ్చాక ఇస్తామని వెనక్కి పంపుతున్నారన్నారు. స్లిప్పులు ఇచ్చిన రైతులందరకీ పైపులు ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. అమడగూరు మండలానికి వెళ్తున్న పైపుల లారీలను అడ్డుకుని ఓడీసీ రైతులకు అందచేయాలని లేకుంటే వెళ్లనీయమని అడ్డుకున్నారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో మాట్లాడారు. అందరికీ పైపులు ఇస్తారని నచ్చజెప్పి నిరసన విరమింపచేశారు. 

మరిన్ని వార్తలు