యువతిపై తండ్రీకొడుకుల అత్యాచారం

12 Aug, 2015 23:11 IST|Sakshi
యువతిపై తండ్రీకొడుకుల అత్యాచారం

- గర్భం దాల్చిన బాధితురాలు

బషీరాబాద్: తండ్రీకొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు ఓ యువతిపై అత్యాచారం చేశారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. బషీరాబాద్ టాకీతండాకు చెందిన 19 ఏళ్ల యువతి స్థానికంగా ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. బషీరాబాద్‌కు చెందిన కాశప్పగౌడ్ కుమారుడు అశోక్‌కు తండాలో కల్లు దుకాణం ఉంది. ఈ క్రమంలో అశోక్‌కు యువతితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు పలుమార్లు యువతిపై అత్యాచారం చేశాడు. అశోక్ తండ్రి కాశప్ప కూడా యువతిని లొంగదీసుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. నాలుగు రోజుల క్రితం స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చి తాండూరులో వైద్య పరీక్షలు చేయించ గా యువతి ఏడు నెలల గర్భవతి అని తేలింది. దీంతో వారు తాండూరులోని నిర్భయ కేంద్రం కౌన్సిలర్ సుభాషిణిని ఆశ్రయించారు. మంగళవారం రాత్రి బాధితురాలు అధికారులతో కలసి బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బుధవారం ఎస్‌ఐ చతుర్వేది ఘటనపై వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తండ్రీకొడుకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు