పిల్లలకు ఉరి వేసి చంపిన తండ్రి

10 Dec, 2016 14:36 IST|Sakshi
పిల్లలకు ఉరి వేసి చంపిన తండ్రి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి పెద్ద తండాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే పిల్లల పాలిట కాల యముడైయ్యాడు. పెద్ద తండాకు చెందిన కాట్రవత్ లాఖ్య నాయక్‌కు ఎనిమిదేళ్ల కిందట మల్లెబోయిన పల్లి తండాకు చెందిన శాంతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు చందాన(6), చరణ్(4)లు ఉన్నారు. ఏడాది కిందట లాఖ్యానాయక్, శాంతిలు తండాను వదిలి జడ్చర్లకు వచ్చేశారు.

 
పిల్లలిద్దరూ బాదేపల్లిలోని స్మార్ట్ వండర్ స్కూల్‌లో మొదటి తరగతి, ఎల్‌కేజీ చదువుతున్నారు. కుటుంబంలో కలతలు కొనసాగుతుండగా నెల రోజుల కిందట పిల్లలను తీసుకుని శాంతి పుట్టింటికి వెళ్లింది. బుధవారం లాఖ్యానాయక్ పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని పెద్ద తండాకు వచ్చాడు. రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం పిల్లలను బడికి పంపేందుకు యూనిఫామ్ వేసి కుర్‌కురే ప్యాకెట్ తీసుకుని పిల్లలతో పొలం వెళ్లాడు. అక్కడ వారి గొంతు నులిమి చంపేసి పొలంలో ఉన్న చొప్ప గూడులో దాచాడు. 
 
అక్కడి నుంచి తిమ్మాజీ పేట మండలం దొనబండ తండాలో ఉన్న తన పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. పిల్లలను తానే చంపానని పెద్ద తండాలో ఉన్న తన అన్నకు శుక్రవారం ఫోన్ చేశాడు. దాంతో ఎంపీటీసీ ఉదయ్‌ నాయక్, లాఖ్యా నాయక్ సోదరుడు అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. పెద్ద తండాలో ఉన్నట్లు తెలుసుకుని శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లారు. 
 
శనివారం తెల్లవారుజామున నిందితుడిని తీసుకెళ్లి పిల్లల మృతదేహాలను దాచిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించగా సి.ఐ. గంగాధర్, ఎస్సై మధుసూదన్‌గౌడ్ అక్కడికి చేరుకుని పిల్లల మృతదేహాలను బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. భార్యపై అనుమానంతోనే పిల్లలను హత మార్చినట్లు స్థానికులు తెలిపారు. లాఖ్యానాయక్ భార్య, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు.

మరిన్ని వార్తలు