కుమార్తెను కొట్టి చంపిన తండ్రి

7 Apr, 2016 20:15 IST|Sakshi
దుర్గాభవానీ (ఫైల్)

ప్రకాశం జిల్లాలో పరువు హత్య
ఓ యువకుడిని ప్రేమించడమే ఆమె చేసిన నేరం


చీరాల రూరల్:  ఓ తండ్రి.. 18 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తెను బంధువుల సాయంతో హతమార్చాడు. ఆమె చేసిన నేరం.. ఓ యువకుడిని ప్రేమించడమే. పరువు పోయిందని భావించి కన్నపేగును ఆ తండ్రి నిలువునా చీల్చాడు. ఈ పాపంలో బాలిక మేనత్త, ఆమె భర్త, వారి ఇద్దరు కుమారులు భాగస్వాములయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన కటకం దుర్గాభవానీ(18) గత నెల 27న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దుర్గాభవానీ సోదరుడు గోపి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఆమె తన తండ్రి, బంధువుల చేతిలో హత్యకు గురైనట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేశారు.

దుర్గాభవానీ చీరాలలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈమెకు నెల్లూరు జిల్లాకు చెందిన పోలయ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో నెల క్రితం అతడి వెంట వెళ్లిపోయింది. దుర్గాభవానీ మైనర్ కావడంతో పోలయ్య ఆమెను నెల్లూరు పోలీసుల సాయంతో వెంకటగిరిలోని రెస్క్యూ హోమ్‌లో చేర్పించాడు. విషయం తెలిసిన తండ్రి రెస్క్యూ హోమ్‌కు వెళ్లి ఇంటర్ పరీక్షలు రాయిస్తానని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. బంధువుల సాయంతో ఇనుప రాడ్డుతో కొట్టి చంపి, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు.
 

మరిన్ని వార్తలు