కొడుకు ప్రేమవివాహం చేసుకుంటాననడంతో...

8 Nov, 2016 23:53 IST|Sakshi

హిందూపురం రూరల్‌ : చేతికొచ్చిన కుమారుడు తన మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఓ తండ్రి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెద్ద గుడ్డంపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. రూరల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆదినారాయణ తెలిపిన వివరాల మేరకు.. పెద్దగుడ్డంపల్లికి చెందిన సూర్యనారాయణ (58) చిన్న కుమారుడు శివకృష్ణ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నాడు.

ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంటానని శివకృష్ణ తన తండ్రితో చెప్పడంతో ఆయన మందలించాడు. దీనికి కుమారుడు ససేమిరా అనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ మంగళవారం ఉదయం రేషం షెడ్డులోకి వెళ్లి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సూర్యనారాయణను భార్య రామాంజినమ్మ హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు