బయోమెట్రిక్‌ లోపాలు.. డీలర్లకు కాసులు

23 Oct, 2016 00:24 IST|Sakshi

వేముల :
 పెద్దజూటూరు గ్రామానికి చెందిన ఇతని పేరు వనిపెంట వెంకట్రామిరెడ్డి. ఈనెల 13వ తేదీన విత్తనాల కోసం బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేశారు. విత్తనాలు తీసుకోకున్నా.. 5 సంచులు ఇచ్చినట్లు సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. సెల్‌ మెసేజ్‌ డీలర్‌కు చూపితే తీసుకెళ్లావని అంటున్నాడు.   అధికారులు కూడా డీలర్‌కు వంతపాడుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.. ఇలా ఇచ్చుకుంటూ పోతే నష్టాలు వస్తాయని డీలర్‌ అంటున్నాడని రైతు  వాపోయాడు. నా సెల్‌కు మెసేజ్‌ వచ్చినా విత్తనాలు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు.
– ఇతని పేరు ఖాదర్‌. మండలంలోని మీదిపెంట్లకు చెందిన రైతు. విత్తనాల కోసం బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేశాడు. సెల్‌కు వచ్చిన మెసేజ్‌ను గోడౌన్‌ వద్ద డీలర్‌కు చూపించాడు. నీవు తీసుకెళ్లావని  అంటున్నాడు. ఈ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సెల్‌కు వచ్చిన మెసేజ్‌పై అధికారులు ఆరా తీయడంలేదు.
   జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల మంది రైతులు ఇలాంటి మెసేజ్‌లతో విత్తనాలు అందక అవస్థలు పడుతున్నారు. వాటిని ఆసరాగా తీసుకున్న డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రబీ సాగుకు  శనగ విత్తనాల పంపిణీకి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ డీలర్లకు కాసులు కురిపిస్తోంది. విత్తనాలు తీసుకోకున్నా  రైతుల సెల్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలా వస్తే స్టాకు తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు అవుతుంది.  ఒక్కో మండలంలో 40నుంచి 50మంది దాకా బాధితులు ఉన్నారు. ఇలాంటి మెసేజ్‌లవల్ల సరాసరి ఒక్కో రైతుకు క్వింటాల్‌కు చొప్పున 40నుంచి 50క్వింటాళ్ల దాకా విత్తనాలు దారి మళ్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.   బయట మార్కెట్‌కు అమ్మితే నాలుగైదు లక్షల వరకు గిట్టుబాటు అవుతుందని డీలర్లు లెక్కలేసుకున్నట్లు తెలుస్తోంది.
మండలాల్లో బయోమెట్రిక్‌ మిషన్‌లో లోపాలు ఉండటంతో రైతులు విత్తనాలు తీసుకోకున్నా.. తీసుకున్నట్లు సెల్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి.సాధారణంగా మిషన్‌లో వేలిముద్ర అక్టివేట్‌ అయిన వెంటనే ఎంత భూమి, ఎన్ని బ్యాగ్‌లు, ఎంత మొత్తం చెల్లించాలనే వివరాలు రావాలి. అలా కాకుండా కొంతమంది రైతులకు నేరుగా విత్తనాల బ్యాగ్‌లు ఇచ్చినట్లు వస్తోంది.  సెల్‌ మెసేజ్‌ను తీసుకెళ్లి డీలర్ల వద్ద చూపితే  ఇక నీకు విత్తనాలు రావని  చెబుతున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
నాలుగైదు లక్షల సొమ్ము చేసుకుంటున్న డీలర్లు :
రైతులకు విత్తనాలు ఇచ్చినట్లు మెసేజ్‌ ఆధారంగా డీలర్లు విత్తనాలను స్వాహా చేసి బయట మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఒక్కో మండలంలో డీలర్లు నాలుగైదు లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. బయో మెట్రిక్‌లో లోపాలు తలెత్తడంతో అన్నదాతలకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు.  ఈ మెసేజ్‌ల ఆధారంగా స్టాకు డీలర్లు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
విత్తనాలు అందేలా చర్యలు
విత్తనాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు రైతుల సెల్‌లకు మెసేజ్‌లు వస్తున్న మాట వాస్తవమే.  బయోమెట్రిక్‌లో సాంకేతిక లోపాలతో అలా  వచ్చి ఉండవచ్చు.  వివరాలను తీసుకొని   రైతులకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటాం.  విత్తనాలను ప్రక్కదారి మళ్లించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం.
        – జమ్మన్న(వ్యవసాయ శాఖ ఏడీ), పులివెందుల
 
 

మరిన్ని వార్తలు