– ఆర్పీఎస్ అధ్యక్షుడు కందనవోలు కృష్ణయ్య
కర్నూలు(అర్బన్): సామాజిక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని రాయలసీమ ప్రజా సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు కందనవోలు కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్లోని బీసీ భవన్లో ప్రజా సమితి ఉపాధ్యక్షుడు టీ నాగభూషణం అధ్యక్షతన ‘ రాయలసీమ వెనుకబాటు తనం – సామాజిక వెనుకబాటుతనం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయ ఆచారి, జనం మాట పత్రిక ఎడిటర్ సత్యన్న, రాయలసీమ ప్రజా వేదిక కన్వీనర్ సీవై రామన్న, కో కన్వీనర్ పగడాల శేఖర్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, బీసీ ఐక్యవేదిక కన్వీనర్ టీ శేషఫణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మారోజు వీరన్న, డాక్టర్ మాధవస్వామి స్ఫూర్తితో భౌగోళిక రాయలసీమలో బహుజన ప్రజారాజ్య స్థాపనకు ఉద్యమించాలన్నారు. జీఓ నెంబర్ 69ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గురు రాఘవేంధ్ర, వేదవతి, గుండ్రేవుల, చెన్నరాయుని తిప్ప ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరికి కేటాయించిన మిగులు జలాలకు చట్టబద్ధత కల్పించాలని, కేసీ కెనాల్ మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల సాధనకు ఈ నెల 3న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని, 9న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ప్రజాపార్టీ అధ్యక్షుడు కంది వరుణ్కుమార్ యాదవ్, ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కే బలరాం పాల్గొన్నారు.