సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం

23 Aug, 2016 00:25 IST|Sakshi
కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు
  • టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంనారాయణ 
  • ఖమ్మం మామిళ్లగూడెం : జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం విరమించేదిలేదని టీయూడబ్ల్యూజేæ(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టెకోల రాంనారాయణ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. రెండేళ్లలో అనేకమంది కొత్త జర్నలిస్టులు వచ్చారని, అక్రిడిటేషన్‌ కార్డులు లేక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లాలో మెరుగైన వైద్యం అందక 18మంది జర్నలిస్టులు మరణించారని గుర్తుచేశారు. హెల్త్‌కార్డుల ద్వారా అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో  వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పోరాటం చేసి ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసిందని విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు ప్రసేన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ధర్నాకు వివిధ రాజకీయ పక్షాలు, జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలిపాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు,  టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఐతగాని జనార్దన్, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్సు అసోసియేషన్, వివిధ ప్రజాసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు.  ధర్నా చౌక్‌ నుంచి జెడ్పీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ)  జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరావు, నాయకులు సామినేని మురారి, తాళ్లూరి మురళీకృష్ణ, వింజం వెంకటనర్సయ్య, వనం వెంకటేశ్వర్లు, మాధవరావు, బట్టు శ్రీనివాస్, కల్లొజి  శ్రీనివాసరావు, బీవీ రమణరెడ్డి, రాజు, సుధాకర్, నాగేశ్వరావు, రాంబాబు, సత్యనారాయణచారి, రవి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు