అనంతపురం ఎడ్యుకేషన్ :
స్థానిక రుద్రంపేట సమీపంలోని మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన బాలాజీ ఎంబీఏ కళాశాలలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు వంద కంప్యూటర్లు కాలిపోయాయి. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలోని కంప్యూటర్ సెంటర్కు ల్యాబ్ అసిస్టెంట్ రామ్మోహన్రెడ్డి వెళ్లి ఏసీ స్విచ్ ఆన్ చేశాడు. షార్ట్ సర్క్యూట్ జరిగి, నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. కళాశాల సిబ్బంది తేరుకునేలోపే మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే కంప్యూటర్లు, ఏసీలు, వీల్చైర్లు, రెండు సర్వర్లు, ఫ్యాన్లు, ఎల్సీడీ ప్రొజెక్టర్ తదితర వస్తువులు కాలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.