ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా : ఐదుగురు అరెస్ట్

23 Dec, 2015 14:59 IST|Sakshi

అనంతపురం: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఘరానా మోసం చేసిన ఓ ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే..అనంతపురంలో కొందరు కౌన్సిల్ ఫర్ ఆగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అండ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (సీఏఈఎఫ్‌ఎం) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు చెందిన ఎన్ జ్యోతి ప్రసాద్‌రెడ్డి (ఛైర్మన్), సాధీక్‌వలీ (జీఎం), ఎం. కృష్ణ (సీఈఓ) కలిసి పంగల్‌రోడ్డుని టీటీడీసీలో 2015 జనవరిలో మరో సంస్థను స్థాపించారు. అప్పట్లో సుమారు 324 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు జరిపి వారి నుండి ఒక్కొక్కరితో రూ. 25 వేల నుండి రూ. 60 వేల వరకు రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు చేశారు.

కొంతమందికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉద్యోగులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను రెండు నెలల పాటు నిర్వహించారు. తరువాత ఆ సంస్థలోని ఉద్యోగులు వేతనాలు చెల్లించాలంటూ సంస్థ యజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆరు నెలలు తరువాత మోసపోయిన బాధితులు మూడవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసుల ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొన్నప్పటికి ఈ మోసగాళ్లు వెనుక అధికారపార్టీ నాయకులు ఉండడంతో పోలీసులను దర్యాప్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను నిలదీయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

ఎవరూ జ్యోతిప్రసాద్ రెడ్డి...
చిత్తూరు జిల్లాకు చెందిన జ్యోతిప్రసాద్‌రెడ్డికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి కుటుంబ సభ్యులతో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. జ్యోతిప్రసాద్రెడ్డి ఇప్పటికే ముగ్గురిని వివాహాం చేసుకుని నిత్యం మోసాలకు పాల్పడుతూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓ మంత్రి వద్ద తలదాచుకుంటున్నట్టు బాధితులు చెప్పుతున్నారు. అయితే పోలీసులు అసలు ముద్దాయిలను వదిలిపెట్టి ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంపై పలు విమర్శలకు దారితీస్తోంది.

 

మరిన్ని వార్తలు