అగనంపూడి : మహా విశాఖ పరిధిలో పంద్రాగస్టుకు మూడు రంగుల జెండా ఎగురవేసే అదష్టం పాఠశాల యాజమాన్యం కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్లకు దక్కింది. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్పొరేటర్లు అందుబాటులో లేరు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, పాథమికోన్నత పాఠశాలల్లో ఎంపీటీసీలు, ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీలు పతాకావిష్కరణ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే పాలక మండళ్లులేని జీవీఎంసీలో పతాకావిష్కరణ ఎవరు చేయాలనే విషయమై స్పష్టత లేకపోవడంతో స్పందించిన మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డికి ఆదేశాలిచ్చారు. ఈమేరకు జీవీఎంసీ పరిధిలోని పెందుర్తి, చినగదిలి, భీమిలి, ఆనందపురం, పరవాడ, పెదగంట్యాడ, సబ్బవరం, అనకాపల్లి మండలాల పరిధిలోని జీవీఎంసీ విలీన ప్రాంతాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకే ఆ హోదా దక్కింది.