బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

11 Aug, 2016 19:13 IST|Sakshi
బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
పాలకొల్లు అర్బన్‌ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని సహా బీసీ శంఖారావ సభలో 22 తీర్మానాలు చేసినట్టు జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు నవుడు వెంకట రమణ, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు. పాలకొల్లులో బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పాల్గొన్న సభలో వివిధ అంశాలపై తీర్మానాలు చేసినట్టు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీ రాజ్‌ సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 50 శాతం పెంచి రాజ్యాంగ భద్రత కల్పించాలని, బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, కేంద్ర, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలనే డిమాండ్లు తీర్మానాల్లో ఉన్నాయన్నారు. బీసీ కార్పొరేషన్‌ బడ్జెట్‌ ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించాలని కోరామన్నారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నూతన కమిటీ సభ్యులతో కృష్ణయ్య ప్రమాణస్వీకారం చేయించారన్నారు.  
 
మరిన్ని వార్తలు