లోక కల్యాణార్థం..

18 Sep, 2016 23:18 IST|Sakshi
లోక కల్యాణార్థం..
–  శ్రీశైలంలో కొనసాగుతున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవం 
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని చంద్రావతి కల్యాణమండపంలో తెనాలి శ్రీమద్భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి కోటి గాయత్రి, కోటి లలితానామ జపయజ్ఞ పారాయణ మహోత్సవం అత్యంతవైభవంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9 గంటల వరకు జపాలు, అనంతరం 12గంటల వరకు పారాయణలు, ఆ తర్వాత మహానివేదన, ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు విష్ణుభట్ల  తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 21 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  జగద్గురువు దివ్యాశీస్సులతో లోక కల్యాణార్థం, మానవులందరికీ సంత్పంకల్పం కలగాలంటే శ్రీగాయత్రీ మాతను సమష్టిగా కోటి సంఖ్యారూపంగా ఆరాధించి, జపించడంతో పాటు మహిళలచే కోటి లలితా నామ జప పారాయణలు జరిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం సమయానికి 84 లక్షలు లలితానామ జపం, 72 లక్షల గాయత్రి నామ జపం పూర్తయినట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో ఉమ్మడిరాష్ట్రాల హైకోర్టు  న్యాయమూర్తి జస్టీస్‌  బి. శివ శంకరరావు పాల్గొన్నారు. వారికి ట్రస్ట్‌ నిర్వాహకులు ఆశీర్వచనాలను అందజేశారు. ముందుగా ఆయన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు.    
 
మరిన్ని వార్తలు