లఘు చిత్రాలతో రైతుల్లో చైతన్యం

26 Feb, 2016 02:27 IST|Sakshi
లఘు చిత్రాలతో రైతుల్లో చైతన్యం

రాంబిల్లి: సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ లఘు చిత్రాలను చిత్రీకరిస్తోంది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా సాగుపై రైతులు దృష్టిని కేంద్రీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మ విభాగానికి చెందిన బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ పర్యవేక్షణలో అయిదుగురు వీఆర్‌పీ(వీడియో రీసోర్స్ పర్సన్)లతో   బృందాలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఈ బృందాలకు హరిపురంలోని కేవీకేలో 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ మూడో రోజు గురువారం పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. డిజిటల్ గ్రీన్ అనే సంస్థ ఈ శిక్షణ ఇస్తోంది. లఘు చిత్రాల చిత్రీకరణ, సుస్థిర, సేంద్రియ వ్యవసాయం చేస్తూ విజయాలు సాధించిన రైతుల గాథలను ఈ చిత్రాల్లో పొందుపరుస్తారు.

ఆయా రైతుల అభిప్రాయాలను చిత్రీకరిస్తారు. 5 మంది వీఆర్పీలు ఈ లఘు చిత్రాల్లో నటిస్తున్నారు. రైతుల యాసలో మాట్లాడుతూ, రైతులకు ఆసక్తిని క లిగించేలా ఈ లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటే వాటికి హాజరయ్యే రైతులు తక్కువగా ఉంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఇటువంటి శిక్షణలకు రైతులు హాజయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం  ఈ తరహా ప్రయోగం మేలని భావించిందని శ్రీకాకుళం జిల్లా బీటీఎం అరుణమణి తెలిపారు. ఈ లఘు చిత్రాలను ప్రతి గ్రామంలో రైతులు పని ముగించుకొని తీరిగ్గా ఉన్నప్పుడు  సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ప్రదర్శించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.

>
మరిన్ని వార్తలు