రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

3 Jan, 2017 01:24 IST|Sakshi

వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

ఆటోలోంచి పడి కూలీ..

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఓబులేసు తన సొంత ఆటోలో మరో ముగ్గురు కూలీలను ఎక్కించుకొని వైఎస్సార్‌జిల్లా పెద్దకుడాల గ్రామానికి చీనీ చెట్లలో కత్తిరింపు పనులకు వస్తున్నారు. లింగాల మండల కేంద్రం దాటగానే సడన్‌బ్రేక్‌ వేయడంతో కూలీ పెద్దగుర్రప్ప (60) ఆటోలోంచి ఎగిరి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతి స్విమ్స్‌కు రెఫర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొస్తుండగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

వైద్యం కోసం వెళుతూ కానరాని లోకాలకు...

గంగవరం (చిత్తూరు) : ధర్మవరం పట్టణానికి చెందిన లింగమూర్తి (60) బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈయనకు వైద్యం చేయించేందుకని బంధువులు కిశోర్‌, నారాయణస్వామి, శివమూర్తి, మంజునాథ్‌లు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి ఆదివారం రాత్రి కారులో బయల్దేరారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లింగమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.  

మరిన్ని వార్తలు