గ్యాస్‌ పైపు లీకై..మంటలు వ్యాపించి

6 Sep, 2017 11:52 IST|Sakshi
గ్యాస్‌లీకై మంటలు వ్యాపించడంతో దగ్ధమైన ఇంటిలోని సామగ్రి

13నెలల చిన్నారితో సహా తల్లిదండ్రికి గాయాలు
గ్యాస్‌బండ పేలక పోవడంతో తప్పిన ప్రమాదం


మిర్యాలగూడ అర్బన్‌ :
గ్యాస్‌పైపు లీకై మంటలు వ్యాపించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని శాబూనగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం... శాబూనగర్‌కు చెందిన వంట మేస్త్రి సన్నిది నగేష్‌ కుటుంబంతో పాటు తన కుమారుడు సతీష్, సౌజన్యలతో కలిసి ఒకే ఇంట్లో   నివాసం ఉంటున్నారు. కాగా మంగళవారం మధ్యాహ్నం వంటచేసుకునేందుకు గ్యాస్‌ లైటర్‌తో స్టౌవ్‌ను వెలిగించేందుకు ప్రయత్నించగా అప్పటికే   గ్యాస్‌ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తప్పించుకునే క్రమంలో సతీష్, సౌజన్యలకు స్వల్ప గాయాలు కాగా వారి 13నెలల కుమార్తె తన్వితకు తీవ్ర గాయాలయ్యాయి.

మంటలను గమనించిన స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. అనంతరం  నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని 108 వాహనంలో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వుండటంతో నల్లగొండకు తరలించారు. అనంతరం మెరుగైన చిక్తిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు వారు తెలిపారు. మంటల ధాటికి ఇంట్లోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోగా సిలిండర్‌ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేల సిలిండర్‌ పేలితే జరిగే ప్రమాదాన్ని ఊహించలేకుండా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా సంఘటన స్థలానికి వన్‌టౌన్‌ పోలీసులు, రెవెన్యూ అధికారులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు