ప్రియుడు పెళ్లి చేసుకోడేమోనని..

23 Feb, 2014 02:30 IST|Sakshi

అశ్వాపురం, న్యూస్‌లైన్: ప్రేమించిన వ్యక్తి ెపెళ్లి చేసుకోడేమోనని మనస్తాపంతో ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలోని చింతిర్యాలగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతిర్యాలగూడేనికి చెందిన సవలం రాధిక(19) అదే గ్రామానికి చెందిన  కాటి వెంకటనారాయణ ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా వెంకటనారాయణ వాయిదా వేస్తున్నాడు. ఈ విషయం ఇరుకుటుంబాలకు తెలిసింది. ఈ క్రమంలో తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు పలుమార్లు వెంకటనారాయణ తల్లిదండ్రులను కోరారు. పెళ్లి చేస్తామని, కొంత గడువు కావాలని వారు జాప్యం చేస్తూ వచ్చారు.

 

అతను తమ కుమార్తెను పెళ్లి చేసుకోడేమోనని ఆందోళనతో రాధిక తల్లిదండ్రులు ఇటీవల గ్రామ పెద్దలకు విషయం తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామపెద్దలు సమావేశమై వెంకటనారాయణ తల్లిదండ్రులను పంచాయితీకి రావాలని కోరారు. కానీ రాత్రి సమయంలో తాము రాలేమని, శనివారం ఉదయం వస్తామని తెలిపారు. దీంతో గ్రామ పెద్దలు కూడా శనివారం మాట్లాడుదామని చెప్పి రాధిక తల్లిదండ్రులను పంపించారు.  ఈ క్రమంలో తనను వెంకటనారాయణ పెళ్లి చేసుకోడేమోనని మనస్తాపానికి గురైన రాధిక శనివారం తెల్లవారుజామున అందరు నిద్రిస్తున్న సమయంలో పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి అశ్వాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా వృతి చెందింది. అశ్వాపురం ఎస్సై కిరణ్ శనివారం వృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాధిక తండ్రి ముత్తయ్య ఫిర్యాదు మేరకు వెంకటనారాయణపై కేసు నమోదు చేసి వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలించారు.   
 

మరిన్ని వార్తలు