మా భూములు అప్పగించండి

6 Aug, 2016 00:54 IST|Sakshi
మా భూములు అప్పగించండి
 
మర్రిపాడు : మండలంలోని పొంగూరు గ్రామానికి చెందిన దళితులు తమ భూములు తమకు అప్పగించాలని శుక్రవారం తహసీల్దారు సులోచనకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో భూపంపిణీ 6, 7 విడతల్లో ప్రభుత్వం తమకు భూములు మంజూరుచేసిందన్నారు. ఆ సమయంలో కొంతమందికి మాత్రమే పాసుపుస్తకాలు ఇచ్చారని చెప్పారు. పాసుపుస్తకాలు ఇచ్చినప్పటికీ పేదవారం కావడంతో భూములు సాగుచేసుకోలేకపోయామన్నారు. దీంతో బీడుగా వాటిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తంచేశారు. భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, రికార్డులను చూపించారు. ప్రస్తుతం సోమశిల హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణ పనుల్లో భాగంగా భూములన్నీ మునకకు గురవుతున్నాయన్నారు. దీంతో వాటికి గిరాకీ ఏర్పడిందన్నారు. మరికొంతమంది భూములను రికార్డుల్లో అక్రమంగా మారుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి న్యాయం చేయకపోతే నిరాహారదీక్ష చేపడుతామన్నారు. దీనిపై తహసీల్దార్‌ మాట్లాడుతూ భూముల విషయమై ఇప్పటికే ఆర్‌ఐ, వీఆర్వో ద్వారా విచారణ జరిపిస్తున్నామన్నారు. మిగిలిన భూములపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి భూములను అందచేస్తామని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు