మాకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వండి

2 Aug, 2016 19:59 IST|Sakshi
మాట్లాడుతున్న రాసమల్ల బాలకృష్ణ

బంజారాహిల్స్‌: నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయీ బ్రాహ్మణ సేవా సంఘ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.78లో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెలూన్‌ పెట్టుకునే వారికి ప్రభుత్వం ’10 లక్షల రుణం ఇవ్వాలని... ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని... 50 ఏళ్లు పైబడిన వారికి పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

నాయీ బ్రాహ్మణ భవన్‌ నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయించాలని కోరారు. 200 యూనిట్లు ఉన్న మీటర్లకు కమర్షియల్‌ నుంచి డొమెస్టిక్‌కు మారుస్తూ జీవో జారీ చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా అమలు కావడం లేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండున్నర లక్షల మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని గత పాలకుల హయాంలో అన్ని రంగాల్లో వెనుకబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, మొగిలి రఘు, గ్రేటర్‌ ప్రధాన కార్యదర్శి మామిడాకుల విక్రమ్, రాసమల్ల వినోద్‌కుమార్, తేరుగంటి త్యాగరాజు, ఎలుగుపల్లి వెంకటేష్, రాచకొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు