కానుగ కాయల కోసం వెళ్లి..

28 Apr, 2017 00:05 IST|Sakshi

లేపాక్షి (హిందూపురం) : కానుగ కాయల కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు చివరకు కానరాని లోకాలకు వెళ్లిన విషాదకర సంఘటన ఇది. లేపాక్షి మండలం నాయనిపల్లికి చెందిన నరసమ్మ(70) పొట్ట కూటి కోసం మూడ్రోజుల కిందట కానుగకాయలు తెచ్చి అమ్ముకునేందుకు వెళ్లిందని ఏఎస్‌ఐ సుబ్బరామ నాయక్‌ తెలిపారు. అయితే రాత్రైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారన్నారు.

శిరివరం చెరువులో వృద్ధురాలి మృతదేహం తేలియాడుతుండగా బుధవారం రాత్రి గ్రామస్తులు కొందరు గమనించారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. నాయనిపల్లికి చెందిన నరసమ్మగా గుర్తించారు. కానుగకాయల కోసం వెళ్లిన ఆమె ఎండవేడిమికి తట్టుకోలేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు