మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ

29 Dec, 2016 01:50 IST|Sakshi
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ

మాచారెడ్డి : మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడును దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం సోమారంపేట పంచాయతీ పరిధిలోని రోడ్డుబండ తండాలో జరిగింది. మాచారెడ్డి ఎస్సై నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమారంపేట్‌కు చెందిన గుగ్గిల రేణ రోడ్డుబండ తండా సమీపంలో ఉన్న వాగులో దుస్తులు ఉతకడానికి వెళ్లింది. దుస్తులను ఉతికి ఆరేసిన అనంతరం వాటిని తీసే ప్రయత్నంలో ఉండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఇద్దరు నోరుమూయగా మరో వ్యక్తి బంగారు గొలుసును లాక్కెళ్లారు.

దుండగులు ఎల్లంపేట నుంచి ఇసాయిపేట వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. నిందితులు బైక్‌పై పరారవుతుండగా ఎల్లంపేటలోని సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముగ్గురు మహిళలను బెదిరించి ..
మాక్లూర్‌ : మండలంలోని కల్లెడి శివారులో ముగ్గురు మహిళలను బెదిరించి మూడు తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై రామునాయుడు బుధవారం తెలిపారు. ఎస్‌సై తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడి తండాకు చెందిన దీపిక, శాంతి, పంచు అనే ముగ్గురు మహిళలు కట్టెల కోసం కల్లెడి శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు దుండగులు కత్తులతో వారిని బెదిరించి వారి వద్ద ఉన్న మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌సై తెలిపారు.

మరిన్ని వార్తలు