గోనమాకులపల్లె సోసైటీ డైరక్టర్లు రాజీనామా

2 Sep, 2016 22:24 IST|Sakshi
గోనమాకులపల్లె సోసైటీ డైరక్టర్లు రాజీనామా

 కడప అగ్రికల్చర్‌ : వీరపునాయునిపల్లె మండలం గోనమాకుల పల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు రాజీనామా చేశారు. దీంతో సంఘం (సొసైటీ) మొత్తం రద్దు కానున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సొసైటీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత డైరెక్టర్‌ వర్ధిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు డైరక్టర్లు నేరుగా కడప నగరం పాత రిమ్స్‌లోని డివిజనల్‌ లెవెల్‌ కో–ఆపరేటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకుని రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా డైరక్టర్లు వెంకట్రామిరెడ్డి, గొట్లూరు చెన్నయ్య, లంగనూరు ఈశ్వరయ్య, లింగారెడ్డి శివలింగారెడ్డి, ఏకాశి కమలమ్మ, గోర్ల మల్లిఖార్జున, యాతం చిన్న ఓబులేశు, దాసరి నారాయణరెడ్డి మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షుడు మురళీరెడ్డి ఏ విధంగాను మాకు సహరించడంలేదని, సొసైటీలో ఆయన మాటే చెల్లు బాటు కావాలంటూ పెత్తనం చెలాయించడంతో మేము ఎందుకు పనికి రాకుండా పోయామని, దీంతో తాము మా ప్రాంత రైతులకు న్యాయం చేయలేక పోతున్నామన్నారు. దీనికి నిరసనగానే తామంతా రాజీనామా చేశామన్నారు. ఈ సందర్భంలో డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ ఆఫీసర్‌ గురుప్రకాష్‌ మాట్లాడుతూ ఆ సొసైటీ సీఈఓ సెలవులో ఉన్నందున, రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీలో మొత్తం 13 మంది డైరక్టర్లు ఉన్నారని, వారిలో తనకు 8 మంది డైరక్టర్లు రాజీనామా పత్రాలు సమర్పించారని తెలిపారు. మెజార్టీ డైరక్టర్లు రాజీనామా చేసినందున సొసైటీ రద్దు అవుతుందని పేర్కొన్నారు. సొసైటీ పరిపాలనంతా సీఈఓ చేతికి వెళుతుందన్నారు.
ఫోటోనెం:

మరిన్ని వార్తలు