కర్నూలు అర్బన్‌ మండలానికి ప్రభుత్వ ఆమోదం

27 Aug, 2016 01:29 IST|Sakshi
– ఆరు తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణానికి నిధులు 
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ కార్యదర్శి వెల్లడి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రంలో మొదటి దశలో ఏడు అర్బన్‌ మండలాలు ఏర్పాటులో భాగంగా కర్నూలు అర్బన్‌ మండలం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ కార్యదర్శి రామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.  కర్నూలు అర్బన్‌ మండల ఏర్పాటుపై త్వరలోనే మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. జిల్లాలో ఆరు తహసీల్దారు కార్యాలయాలకు సొంత భవానాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేశామన్నారు. విడుదల చేసిన నిధులను మార్చిలోగా వినియోగించుకొని నిధులు ల్యాప్స్‌ కాకుండా చూడాలని తెలిపారు. ప్రజా సాధికార సర్వే ముగిసిన తర్వాత ‘మీ ఇంటికి మీ భూమి’ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నాలా టాక్స్‌ను లక్ష్యం మేరకు వసూలు చేయాలన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలంటే 10 శాతం పీజు వసూలు చేయడంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి వెంకటనారాయణ, డీ–సెక్షన్‌ సూపరింటెండెంటు ఈరన్న, ప్రొటోకాల్‌ సెక్షన్‌ సూపరింటెండెంటు ఆదినారాయణ, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.     
 
మరిన్ని వార్తలు