‘బీఎంఎం’పై సర్కారు ప్రేమ

5 Dec, 2015 01:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బీఎంఎం సిమెంట్స్‌పై సర్కారు అవ్యాజ ప్రేమ కనబరుస్తోంది. మైనింగ్ లీజులకోసం వచ్చిన వేలాది దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన సర్కారు బీఎంఎం సిమెంట్స్‌కు మాత్రం అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడు గ్రామంలో 1,123.32 ఎకరాల సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి మైనింగ్ లీజును మంజూరు చేసింది. ఈ మేరకు భూగర్భ గనులశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న కొత్త మైనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ చట్టం-2015 ప్రకారం మేజర్ మినరల్స్ లీజులన్నింటినీ వేలం విధానం ద్వారానే కేటాయించాలనేది ముఖ్యమైన అంశం.

అయితే అప్పటికే మైనింగ్, ప్రాస్పెక్టింగ్ లీజుల మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిన, నిబంధనలకనుగుణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మాత్రం పాత విధానంలోనే కేటాయించవచ్చనే వెసులుబాటు ఉంది. దీని ఆధారంగానే టీడీపీ ప్రభుత్వం తాజాగా బీఎంఎం సిమెంట్స్‌కు మైనింగ్ లీజు జారీచేసింది. అయితే మైనర్ మినరల్ పాలసీ వచ్చేవరకూ లీజులు జారీ చేయబోమంటూ వేలాది దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. ఈ సంస్థకు మాత్రం లీజు ఇవ్వడంలో ‘ప్రత్యేక అభిమానం’ చూపడం గమనార్హం.

మరిన్ని వార్తలు